DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని విట్టా కిష్టప్ప నగర్లో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియాన్ని వెంటనే పూర్తి చేయాలని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ నూరూల్ ఖమర్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా SFI జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు సంజయ్, కార్యదర్శి శశిధర్ మాట్లాడుతూ, 2018లో టీడీపీ ప్రభుత్వం రూ.2 కోట్ల వ్యయంతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ వెనుక విట్టా కిష్టప్ప నగర్లో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 2017-18లో ఎన్టీఆర్ క్రీడా వికాస్ కేంద్రంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైందని చెప్పారు. అయితే, గత ఐదేళ్లుగా పనులు పూర్తిగా నిలిచిపోయి, మొండి గోడలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా స్థానిక క్రీడాకారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయిన ఈ స్టేడియం మిగిలిన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆదోని ప్రాంతం నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక మంది క్రీడాకారులు వెలుగొందుతున్నారని, సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి స్పందించి పనులను వేగవంతం చేయాలని కోరారు. లేకపోతే, SFI ఆధ్వర్యంలో క్రీడాకారులతో కలిసి భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Admin
DNB News