DNB News - ఆంధ్రప్రదేశ్ / : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాపు నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిని నిన్న ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ తీరు పూర్తిగా అప్రజాస్వామికమని, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ముందస్తు ప్రణాళికతో ఈ అరెస్టులు చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారనే భయంతోనే వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి వారి గొంతు నొక్కేందుకే ఈ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు. అభివృద్ధిని గాలికొదిలేసి, ప్రతిపక్ష నాయకులను వేధించడమే ధ్యేయంగా ప్రస్తుత ప్రభుత్వం పాలన సాగిస్తోందని రవికుమార్ అన్నారు. అక్రమ అరెస్టులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయపెట్టలేరని, ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తక్షణమే అంబటి రాంబాబు గారిపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్ కుమార్, బూర్జ వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షులు ఖండాపు గోవిందరావు, సరుబుజ్జిలి మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు బెవర మల్లేశ్వరరావు తదితర వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
Admin
DNB News