DNB News - ఆంధ్రప్రదేశ్ / : కష్టపడి పనిచేసే పేదలపై భారీ జరిమానాలు వేయడం వల్ల వారి బతుకులు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్కు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అండగా నిలిచారు ఆదోని మండలం గణేకల్లు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కుప్పయ్యగారి తిమ్మప్ప సోషల్ మీడియా వేదికగా తన గోడును వెల్లడించారు. రోజంతా కష్టపడితే రూ.400 నుండి 500 మాత్రమే వస్తుందని, అందులో ఎక్కువ భాగం పోలీసుల జరిమానాలకే వెళ్తోందని ఆయన కన్నీటి పర్యంతమవుతూ విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. తన తల్లి కూలీ పనికి వెళ్లి సంపాదించే రూ.200 తో కలిసి ఇల్లు గడుస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో భారీ పెనాల్టీలు వేస్తే పేదలు ఎలా బతకాలని తిమ్మప్ప ప్రశ్నించారు. అధికారులకు మానవతా దృక్పథం ఉండాలని ఆయన కోరారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వెంటనే స్పందించి తిమ్మప్ప ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆటో డ్రైవర్ పక్కన కూర్చుని ఆయన సమస్యలను అడిగి తెలుసుకుని భుజం తట్టి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం పేదలను ఇబ్బంది పెట్టకూడదని, నిబంధనల పేరుతో సామాన్యుల పొట్ట కొట్టడం సరికాదన్నారు. తిమ్మప్ప లాంటి కష్టజీవులకు అన్యాయం జరగకుండా చూస్తామని, ఈ విషయాన్ని సీఎం, డీసీఎం మరియు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి జరిమానాల వేధింపులు తగ్గించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న సామాన్యుడి పిలుపునకు స్పందించి నేరుగా ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే పార్థసారథిపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Admin
DNB News