DNB News - ఆంధ్రప్రదేశ్ / : శ్రీసిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి, హైదరాబాద్కు చెందిన విజ్డమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఆధ్యాత్మికతతో కర్తవ్య నిర్వహణ' అనే అంశంపై బుధవారం ఉదయం శ్రీసిటీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ తత్వవేత్త వినయ్ జీ స్ఫూర్తిదాయక ప్రసంగం చేయగా, పలువురు పరిశ్రమల ఉద్యోగులు, విద్యావేత్తలు, స్థానిక ప్రజలు పాల్గొని ఆధునిక జీవనంలో ఆధ్యాత్మికత ఆవశ్యకతపై తగు అవగాహన పొందారు.స్థానిక బీరోలెక్స్ పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ వై.శ్రీనివాస్ రెడ్డి అతిథిని పరిచయం చేసి, వినయ్ జీ బోధనలపై తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు.వినయ్ జీ తన ప్రసంగంలో భగవద్గీత ఆధారంగా ఆధునిక ఉద్యోగ జీవనంలో ఆధ్యాత్మికత ప్రాముఖ్యతను వివరించారు. ఫలితాలను ఆశించకుండా కర్తవ్య నిర్వహణ చేయడం, జయాపజయాల పట్ల నిశ్చల భావన కలిగి ఉండటం ద్వారా పని మరింత అర్థవంతంగా మారుతుందని తెలిపారు. కర్మయోగం ద్వారా నైతిక నాయకత్వం, ఆత్మ నియంత్రణ, మానసిక స్థైర్యం సాధ్యమవుతాయని వివరించారు. రాజస, తమస, సాత్విక గుణాలపై విశ్లేషన, సోదాహరణ ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఆత్మ నియంత్రణ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, నిరర్ధక విషయాలపై దృష్టి పెట్టకుండా, జాగరూకతతో ఉద్దేశ్యపూర్వకమైన కార్యాచరణను ఆచరించమని సభికులను ప్రేరేపించారు. చివరగా కర్తవ్య నిర్వహణలో ఆధ్యాత్మికత అనేది పూర్తిగా జ్ఞాన ఆధారిత చర్య అని ఆయన నిర్థారించారు.తమ ఆహ్వానం మేరకు శ్రీసిటీ విచ్చేసి విలువైన ప్రసంగం చేసిన వినయ్ జీకి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తన సందేశంలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం పరిశ్రమల వర్గాలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఉత్సాహంగా పాల్గొని, వ్యాపార నిర్వహణ, వ్యక్తిగత అభివృద్ధిలో ఆధ్యాత్మికతను ఎలా అమలు చేయాలన్న అంశాలపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమం వ్యక్తిగత శ్రేయస్సు, సంస్థల పనితీరు మెరుగుదలకు దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.విజ్డమ్ ఫౌండేషన్ 2017లో వినయ్ జీ స్థాపించిన ఒక ధార్మిక సంస్థ. ఇది సనాతన ధర్మంలోని మూల సూత్రాలను ప్రజలకు పరిచయం చేసి, వాటిని ఆచరణలోకి తీసుకురావడం లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ సంస్థ ఉపన్యాసాలు, అధ్యయన తరగతులు, వర్క్షాప్లు, కార్పొరేట్ సెమినార్లు ద్వారా ఒత్తిడి నిర్వహణ, స్వీయ అభివృద్ధి మరియు అర్థవంతమైన జీవన విధానానికి దోహదపడే ఆధ్యాత్మిక అంశాలను వివరిస్తాయి.
Admin
DNB News