DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు: కోసిగి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులతో వంట పనులు, పారిశుద్ధ పనులు చేయిస్తున్న ప్రిన్సిపల్పై తక్షణ చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కర్నూలు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరూల్ కమర్కు ఎస్ఎఫ్ఐ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సాయి ఉదయ్, కార్యదర్శి రంగప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ కోసిగి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులతో వంట పనులు, పారిశుద్ధ పనులు చేయించడం విద్యార్థి హక్కుల ఉల్లంఘన అని అన్నారు. ఈ ఘటన జరిగి పది రోజులు గడిచినా సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. అంతేకాకుండా విద్యార్థులకు త్రాగునీటిని డస్ట్బిన్లలో నిల్వ చేసి ఇవ్వడం, అసభ్య పదజాలంతో విద్యార్థులను దూషించడం వంటి ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంపై జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి విచారణ జరిపినప్పటికీ చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ఘటనపై తక్షణమే పూర్తిస్థాయి విచారణ జరిపి విద్యార్థులతో పనులు చేయిస్తున్న ప్రిన్సిపల్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అధికార విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ ప్రిన్సిపల్కు సహకరిస్తున్న జిల్లా సమగ్ర శిక్ష అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా నగర నాయకులు శివ పాల్గొన్నారు
Admin
DNB News