DNB News - ఆంధ్రప్రదేశ్ / : 140వ మేడే దినోత్సవం సందర్భంగా ఆదోని పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలు, ర్యాలీ, సభలు ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ అనంతరం సిఐటియు కార్యాలయం నుంచి భీమా సర్కిల్ మీదుగా రెవెన్యూ భవనం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తదనంతరం జరిగిన మేడే సభలో పట్టణ అధ్యక్షుడు పి.ఎస్. గోపాల్, మండల అధ్యక్షుడు జే. రామాంజనేయులు అధ్యక్షతన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు, సీనియర్ నాయకులు ఈరన్న, కార్యదర్శులు తిప్పన్న, సాయి, లక్ష్మన్న, అంగన్వాడి నాయకురాలు సరోజ తదితరులు ప్రసంగించారు. వక్తలు మాట్లాడుతూ, 140 సంవత్సరాల క్రితం కార్మికులు ఐక్యంగా పోరాడి 8 గంటల పని హక్కును సాధించుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శించారు. ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మేడే స్పూర్తితో కార్మిక ఐక్యతను బలపరచాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను నిర్లక్ష్యం చేస్తూ లేబర్ కోడ్లను అమలు చేయడానికి ప్రయత్నించడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో ఈ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక–కర్షక ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి, రైల్వే, బ్యాంకులను రక్షించాలని, కార్మికులకు సమగ్ర చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ, అంగనవాడి, ఆశ వర్కర్లు మరియు ఇతర కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రెగ్యులర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం కనీస వేతనాన్ని రూ.26,000కు పెంచాలని, కార్మిక సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున, అజీమ్ ఖాన్, తిక్కప్ప, హనుమంతు, శంకర్, ముని, గోవిందు, రాజు, గిరి, కరుణ, లలిత, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News