DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో నీటి వనరులు మరియు చెరువుల ఆక్రమణలకు సంబంధించి జిల్లా స్థాయి వాచ్డాగ్ కమిటీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ శ్రీ నూరుల్ ఖమర్ అధ్యక్షత వహించారు. సమావేశంలో జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు తదితర నీటి వనరుల పరిరక్షణపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా చెరువులపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలను గుర్తించి, వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నీటి వనరుల పరిరక్షణలో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల సమన్వయం అత్యంత అవసరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆక్రమణలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు గ్రామ స్థాయిలో సర్వే నిర్వహించి, చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ (FTL) పరిమితులను స్పష్టంగా గుర్తించి, రికార్డులు నవీకరించాలని ఆదేశించారు. ప్రజలు కూడా నీటి వనరుల పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
DNB News