DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ నాయకులు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆదోని మున్సిపల్ కమిషనర్ నయూం ని కలిసి సమస్యలతో స్వాగతం పలికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, సీనియర్ నాయకులు ఈరన్న, నాయకులు గోపాల్, తిప్పన్న, వీరేష్, నాగరాజు, వెంకటేష్, అజీమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆదోని పట్టణంలో సమస్యలు “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్న చందంగా ఉన్నాయని విమర్శించారు. కర్నూలు జిల్లాలోని ఆదోని దాదాపు 165 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన మున్సిపాలిటీగా, ఒకప్పుడు “రెండవ ముంబై”గా ప్రసిద్ధి చెందిన పట్టణమని గుర్తుచేశారు. అయితే పాలకుల నిర్లక్ష్యంతో పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా పాత ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రమాదకర స్థితిలో ఉండి కూలే పరిస్థితిలో ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. నిత్యం ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను వేగవంతం చేసి లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. పట్టణంలో రోడ్లు వెడల్పు కార్యక్రమం చేపట్టి ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. అలాగే పట్టణంలో ఆహ్లాదకరమైన పార్కులు ఏర్పాటు చేసి, ప్రస్తుత పార్కుల్లో పిల్లల ఆటపరికరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టణ జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని అదనంగా మరొక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మున్సిపల్ అధికారులు చొరవ చూపాలని సిపిఎం నాయకులు విజ్ఞప్తి చేశారు.
Admin
DNB News