DNB News - ఆంధ్రప్రదేశ్ / : గుడిసె ఆది కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదోనిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు అభినందన సభ నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ, “నేటి బాలలే రేపటి పౌరులు” అని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలు సాధించి ప్రజాసేవలో భాగస్వాములు కావాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా మరింత మంది విద్యార్థులు ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేస్తారని ఆమె అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధికి నిరంతరం తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, మదిరే భాస్కర్ రెడ్డి, హౌసింగ్ డైరెక్టర్ రామకృష్ణ, విట్ట రమేష్, గోనెహళ్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.
Admin
DNB News