DNB News - ఆంధ్రప్రదేశ్ / : దేశంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు చేయడం సరికాదని, చిత్తశుద్ధి ఉంటే కుల వ్యవస్థనే రద్దు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి (DHPS) డిమాండ్ చేసింది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాలని, సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలని కోరుతూ DHPS ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమం కొత్తూరు ఈరన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా DHPS జిల్లా సహాయ కార్యదర్శి టీ. వీరేష్, DHPS నియోజకవర్గ కార్యదర్శి ఏ. విజయ్ కుమార్, ACUC పట్టణ కార్యదర్శి ఆనంద రాజు, వివిధ సంఘాల పాస్టర్లు మాట్లాడుతూ దేశంలోని క్రైస్తవ మత ప్రచారకుల్లో అధికంగా అగ్రకులాల వారే ఉన్నారని, వారికి లేని నిబంధనలు దళిత క్రైస్తవులకు మాత్రమే ఎందుకు వర్తిస్తున్నాయో ప్రశ్నించారు. ఎస్సీల మత స్వేచ్ఛను హరించే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. కుల వివక్షను రూపుమాపలేకపోతే కుల వ్యవస్థనే రద్దు చేయాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15లకు విరుద్ధమని విమర్శించారు. క్రైస్తవ మతంలోకి మారిన అగ్రకులాల వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లభిస్తున్నప్పుడు, అదే మార్గాన్ని అనుసరించిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు ఎందుకు వర్తించకూడదని ప్రశ్నించారు. 1956లో సిక్కు దళితులకు, 1990లో బౌద్ధ దళితులకు ఎస్సీ హోదా కల్పించినట్లు పేర్కొంటూ, దేశవ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో AEOకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో DHPS గౌరవ అధ్యక్షుడు ప్రకాష్, DHPS పట్టణ కార్యదర్శి కుమారస్వామి, సుజ్ఞానమ్మ, ACUC అధ్యక్షుడు ఎజ్రా శ్రీధర్, CPI పట్టణ సహకార కార్యదర్శి రమేష్, AIYF కార్యదర్శి అంజిత్ గౌడ్, CPI మండల కార్యదర్శి ఎల్లప్ప, సత్యనారాయణ, ఏసుదాస్, లాలప్ప, పుష్పరాజ్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News