DNB News - తెలంగాణ / : బంజారా బిడ్డ, ప్రముఖ సింగర్ మంగ్లీపై కొంతమంది కావాలనే ఆరోపణలు చేస్తున్నారని, వాటిని ఖండిస్తున్నామని బంజారా అడ్వకేట్స్ అసోసియేషన్ నాయకులు, న్యాయవాది భూక్యా హరినాయక్ పేర్కొన్నారు. ఖమ్మంలోని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంగ్లీపై ఘోరాతిఘోరమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తప్పు జరిగిందని తెలిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి, సాక్ష్యాలను చూపాలి. కోర్టు శిక్షిస్తుంది. అలాగాకుండా వీుడియా సమావేశం పెట్టి చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. మంగ్లీ భవిష్యత్ను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే ఇదంతా అని ఆరోపించారు. ప్రధాన నిందితుడిని విచారించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. కంపెనీలో మంగ్లీ వాటా ఉందా, బోర్డు డైరెక్టర్గా ఉందా అనే విషయాలు తేలకుండా ఆమెపై ఎలా ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు. నిన్ను వదలనంటూ ఏకవచనంతో మాట్లాడడం సరికాదని, న్యాయవాద వృత్తికే సుబ్బారావు కళంకం తెస్తున్నాడని ఆరోపించారు. సాక్ష్యాలు ఉంటే పోలీసులకు అప్పగిస్తే వారే విచారణ జరుపుతారని అన్నారు. అలాగాకుండా బంజారా బిడ్డపై అవాస్తవమైన, అసత్యమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. ధరావత్ వీరన్న మాట్లాడుతూ మంగ్లీ ప్రతిష్టను దిగజార్చేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నారని అన్నారు. తానే బాధితుల తరుపున ఉంటానని మంగ్లీ చెప్పిందనే విషయం గుర్తు చేసుకోవాలన్నారు. న్యాయవాది బాణోత్ మణిమాల మాట్లాడుతూ మంగ్లీపై ఆరోపణలు బంజారా జాతికి ఘోరమైన అవమానమన్నారు. బెట్టింగ్ యాప్స్లో ఉన్న వారిపై చర్యలు తీసుకోవడం చేతకాదని, ట్యాక్స్లకు కట్టకుండా తప్పించుకు తీరుగుతున్న వారిని ఏం చేయలేకపోతున్నారని, దేశంలో నెంబర్వన్ సింగర్గా ఎదుగుతున్న బంజారా బిడ్డపై మాత్రం అవాస్తవమైన ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. లంబాడీలపై ఎందుకు కక్ష్య కట్టారని ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని సూచించారు. మంగ్లీపై లేనిపోని అరోపణలు చేస్తే బంజారా జాతి చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ సమావేశంలో న్యాయవాదులు తేజావత్ నర్సింహ, ధరావత్ ప్రసాద్, నునావత్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News