DNB News - తెలంగాణ / : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. వసంత్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ భారత చరిత్రలో అపూర్వమైన యోధుడు, ధైర్యవంతుడైన వీరుడు, ప్రజాహిత పరిపాలనకు ప్రతీకగా నిలిచిన మహానుభావుడని తెలిపారు. స్వరాజ్య స్థాపన కోసం ఆయన చేసిన త్యాగాలు, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు నేటి తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి భాగం మాధవరావు, కార్యవర్గ సభ్యులు కాసాని రమేష్, కె. చిన్నికృష్ణ, అడపాల పార్వతి తదితరులు పాల్గొన్నారు. అలాగే సీనియర్ మరియు యువ న్యాయవాదులు భారీ సంఖ్యలో హాజరై శివాజీ మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. సమావేశంలో ప్రసంగించిన వక్తలు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత స్ఫూర్తి, ధైర్యం, న్యాయపరమైన పరిపాలన లక్షణాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.
Admin
DNB News