DNB News - తెలంగాణ / : పొగాకు వాడకం కేవలం ఒక చెడు అలవాటు మాత్రమే కాదని, అది నెమ్మదిగా మనిషి ఆరోగ్యాన్ని కబళించే ప్రమాదకర విషమని వైద్యులు హెచ్చరించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన సదస్సులో వైద్యులు పొగాకు, బీడీ, గుట్కా, తంబాకు వాడకం వల్ల కలిగే తీవ్ర ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్డియాలజిస్టు డాక్టర్ అనీష్ పబ్బ, జనరల్ ఫిజీషియన్లు డాక్టర్ నాగరాజు, డాక్టర్ లోకేష్ మాట్లాడుతూ పొగాకు వినియోగం నేరుగా గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. బీడీ, సిగరెట్, గుట్కా వంటి అలవాట్లు రక్తనాళాలను దెబ్బతీసి గుండెపోటు, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తాయని వివరించారు. కొంతమంది ఒత్తిడి తగ్గించుకోవడానికి లేదా సరదాగా పొగ తాగడం ప్రారంభిస్తారని, కానీ అదే తర్వాత ప్రాణాంతక అలవాటుగా మారుతుందని చెప్పారు. నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో అధిక శాతం మంది పొగాకు వినియోగదారులేనని తెలిపారు. ప్రస్తుతం యువతను లక్ష్యంగా చేసుకుని పొగాకు ఉత్పత్తుల తయారీ సంస్థలు ఆకర్షణీయ ప్రచారాలు నిర్వహించడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఫ్లేవర్స్ కలిపిన పొగాకు పదార్థాలు, కొత్త రూపాల్లో అందుబాటులోకి తీసుకురావడం వల్ల యువతతో పాటు చిన్నపిల్లలు కూడా వీటి వైపు ఆకర్షితులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాషన్గా మొదలైన పొగతాగే అలవాటు చివరికి వ్యసనంగా మారి ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని, కుటుంబ బంధాలను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. ఒక ఇంట్లో ఒక వ్యక్తి పొగతాగితే దాని ప్రభావం అతడికే పరిమితం కాదని, కుటుంబ సభ్యులపై కూడా తీవ్రంగా పడుతుందని హెచ్చరించారు. పొగతాగే వ్యక్తి విడుదల చేసే పొగను పీల్చడం వల్ల పిల్లలు, మహిళలు, వృద్ధులు, గర్భిణులు పరోక్షంగా అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం అధికమని వెల్లడించారు. చిన్నారుల్లో శ్వాసకోశ సమస్యలు, అలెర్జీలు, ఊపిరితిత్తుల ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందన్నారు. బీడీ కార్మికులు కూడా అధిక సంఖ్యలో క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్న పరిస్థితి ఆందోళనకరమని అన్నారు. చెడు అలవాట్లను జీవితంలోకి రానివ్వకుండా యువత జాగ్రత్త పడాలని, ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలని వైద్యులు పిలుపునిచ్చారు. మెడికవర్ సెంటర్హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, దాసరి చంద్రశేఖర్, అబ్దుల్ వకీల్, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News