DNB News - తెలంగాణ / : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల లో ఈరోజు పాలనాపరమైన బాధ్యతలతో రోజంతా నిమగ్నమై ఉండే జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం చర్లలో భిన్నమైన రూపంలో కనిపించారు. ఫైళ్ల మధ్య గడిచే సమయానికి విరామం ఇచ్చి, క్రీడామైదానంలోకి దిగిన ఆయన విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడి ఉల్లాసంగా గడిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో నిర్వహించిన సీఎం కప్ డివిజన్ స్థాయి క్రీడా పోటీలను ఎస్పీ రోహిత్ రాజ్తో కలిసి కలెక్టర్ అధికారికంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం మైదానంలోకి అడుగుపెట్టిన కలెక్టర్, విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడారు. సర్వీస్ వేస్తూ, ర్యాలీల్లో పాల్గొంటూ చిన్నారులతో సమానంగా ఆటలో పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. అధికారులతో పాటు అక్కడ ఉన్న తల్లిదండ్రులు, గ్రామస్తులు ఈ దృశ్యాలను ఆసక్తిగా తిలకించారు. కలెక్టర్తో కలిసి ఆడిన విద్యార్థుల్లో క్రీడల పట్ల కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ, అటవీ ప్రాంతాల్లో నివసించే విద్యార్థుల్లో అపారమైన క్రీడా ప్రతిభ దాగి ఉందన్నారు. వారు తీసుకునే సహజమైన ఆహారం శారీరక దృఢత్వానికి ప్రధాన కారణమని తెలిపారు. సరైన శిక్షణ, మార్గనిర్దేశం అందిస్తే చర్ల ప్రాంతం నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులు మాత్రమే కాకుండా అంతర్జాతీయ క్రీడాకారులు కూడా వెలువడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను కూడా పెంచుతాయని వివరించారు. సీఎం కప్ పోటీల ద్వారా గ్రామీణ ప్రతిభను వెలికి తీసే అవకాశం లభిస్తోందని చెప్పారు. చర్లలో ఇటీవల ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని మరింత అభివృద్ధి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. మైదానానికి విద్యుత్ దీపాల ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేయిస్తామని తెలిపారు. విద్యార్థులు సాయంత్రం వేళల్లో కూడా నిర్భయంగా క్రీడల్లో పాల్గొనేలా అన్ని వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. క్రీడల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోందని అధికారులు తెలిపారు. సీఎం కప్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గుర్తించి, ఉన్నత స్థాయి శిక్షణ అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజ్, క్రీడా శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. బైట్ – జితేష్ వి పాటిల్, జిల్లా కలెక్టర్: “చర్ల ప్రాంతంలోని విద్యార్థుల్లో సహజమైన క్రీడా ప్రతిభ ఉంది. అటవీ ప్రాంతాల్లో పెరిగే పిల్లలు శారీరకంగా దృఢంగా ఉంటారు. సరైన శిక్షణ, మౌలిక సదుపాయాలు కల్పిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయితో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా వీరు తమ సత్తా చాటగలరు.
Admin
DNB News