DNB News - తెలంగాణ / : హైదరాబాద్ నగరంలో పలు రాష్ట్రాల్లో ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గోల్కొండ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం, హబీబ్ నగర్ పోలీసులతో కలిసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని భారీగా బంగారం, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రధాన నిందితుడు సలీం ఖురేషీ అలియాస్ హమీద్ ఖురేషీ అలియాస్ మున్నా ఖురేషీ, వయసు 53 సంవత్సరాలు. ప్రస్తుతం టోలిచౌకీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. మరో నిందితుడు మొహమ్మద్ ఘౌస్ పాషా, వయసు 33 సంవత్సరాలు, తల్లగడ్డ ప్రాంతానికి చెందిన డ్రైవర్. ఈ కేసులో మరో నిందితుడు సబీర్ ముంబైకి చెందినవాడు. అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుల వద్ద నుంచి 220 గ్రాముల బంగారు నగలు, 3100 గ్రాముల వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాల మొత్తం విలువ సుమారు రూ.33 లక్షల 71 వేల 475గా అధికారులు అంచనా వేశారు. నిందితులు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పలు ఇళ్ల దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటివరకు 8 కేసుల్లో తమ ప్రమేయాన్ని నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటిలో కాకినాడ , నెల్లూరు, తిరుపతి, ముంబైలోని ములుండ్, నావఘర్ ప్రాంతాలు, అలాగే మధ్యప్రదేశ్లోని భోపాల్ మిస్రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు ఉన్నాయి. పోలీసుల సమాచారం ప్రకారం… ప్రధాన నిందితుడు సలీం ఖురేషీ ముంబైలో పెరిగాడు. చిన్న వయసులోనే కుటుంబ పరిస్థితుల కారణంగా నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన అతడు, అక్కడి గ్యాంగ్లతో సంబంధాలు పెంచుకుని నేరాలకు పాల్పడినట్లు తెలిపాడు. అనంతరం 2001లో హైదరాబాద్కు వచ్చి కొంతకాలం సాధారణ జీవితం గడిపినా, ఆర్థిక సమస్యల కారణంగా మళ్లీ దొంగతనాల వైపు మళ్లినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల దర్యాప్తులో మరో కీలక విషయం బయటపడింది. నిందితులు ముందుగా కారులో తిరుగుతూ పగటి సమయంలో ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తించేవారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో ఆ ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారం, వెండి నగలను దొంగిలించేవారు. దొంగిలించిన నగలను కరిగించి బిస్కెట్లుగా తయారు చేసి, నాసిక్ మరియు హైదరాబాద్ నగరాల్లోని కొన్ని బంగారు దుకాణాలకు విక్రయించినట్లు వారు అంగీకరించారు. మార్చి 12వ తేదీ రాత్రి మల్లేపల్లి ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు నిందితులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు వారిని ఆపి తనిఖీ చేశారు. వారి వద్ద ఉన్న బ్యాగ్లో బంగారం, వెండి బిస్కెట్లు, స్క్రూడ్రైవర్, హ్యామర్, రెండు మొబైల్ ఫోన్లు లభించాయి. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపినప్పుడు ఈ మొత్తం నేర చరిత్ర వెలుగులోకి వచ్చింది. ఈ ఆపరేషన్ను గోల్కొండ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్. వెంకటేష్, హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం రావు, ఎస్ఐ విజయానంద్ మరియు వారి సిబ్బంది సంయుక్తంగా నిర్వహించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, స్వాధీనం చేసుకున్న ఆభరణాలతో పాటు కేసును హబీబ్ నగర్ పోలీసులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నగర టాస్క్ ఫోర్స్ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆండే శ్రీనివాసరావు ఈ వివరాలను వెల్లడించారు
Admin
DNB News