DNB News - తెలంగాణ / : వేములవాడ మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుండి వరదల్లా నిధులు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ఎములాడను అన్ని విధాలా అభివ్రుద్ధి చేస్తానని చెప్పారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీకి నయాపైసా ఇయ్యలేదని, అసలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులే లేవని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారన్నారు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ మళ్లీ మోసపూరిత హామీలతో ఓట్ల కోసం మీ ముందుకు వస్తోందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజల రక్తాన్ని పీల్చుకున్నారని, ఆ రెండు పార్టీలకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటుంటే... వేములవాడ ఎమ్మెల్యే బీజేపీ నేతలను బెదిరిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బెదిరింపులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆయనకే వంతపాడుతున్నారని అన్నారు. నా మంచితనాన్ని అలుసుగా తీసుకుంటే ఊరుకునేది లేదని, డీజీపీ, ఎస్పీని ఇక్కడికి రప్పించాల్సి ఉంటుందని హెచ్చరించారు. *వేములవాడ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని నాంపల్లి, తిప్పాపూర్, వేములవాడ అంజనీ నగర్, మహంకాళి చౌరస్తా వద్ద జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, బీజేపీ సిరిసిల్ల ఇంఛార్జ్ మీసాల చంద్రయ్య, జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపీ, మాజీ అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణ, రాష్ట్ర నాయకులు చెన్నమనేని వికాస్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా సభల్లో బండి సంజయ్ చేసిన ప్రసంగలోని ముఖ్యాంశాలు... వేములవాడ ఎమ్మెల్యే బీజేపీ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారు. నామినేషన్లు వేయకుండా ఇబ్బంది పెడుతున్నడు. 3 ఏళ్లు మేమే అధికారంలో ఉంటామని పోలీసులను అడ్డుపెట్టుకుని బెదిరిస్తున్నాడట... పోలీసులకు నేను చెబుతున్నా.... మేం ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని చూస్తున్నం. కాంగ్రెసోళ్ల మాటలు విని శాంతి భద్రతల స్రుష్టిస్తే మీరే ఇబ్బందుల్లో పడతారు. వచ్చి వేములవాడలోనే కూర్చుంటా. మీ డీజీపీ, ఎస్పీ ఇక్కడికే రావాల్సి ఉంటుంది. నా రిక్వెస్ట్ చేతగానితనంగా భావిస్తే...ఏం చేయాలో మాకు తెలుసు. మీ తాటాకు చప్పళ్లకు భయపడేది లేదు. వేములవాడలో ఆగమశాస్త్ర సంప్రాదాయాలను పాటించకుండా అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నరు. రాతితో కట్టాల్సిన ఆలయాన్ని సిమెంట్ కాంక్రిట్ తో కడుతున్నరు. అసలు చేస్తున్నరో వాళ్లకే తెలవదు. గుడి నిర్మాణం పేరుతో కాంగ్రెస్ నేతలు మోసం చేస్తున్నారు. ఎములాడ రాజన్నను దర్శించుకునే సమ్మక్క సారలమ్మ జాతర భక్తులు అల్లాడిపోయారు. భక్తులు బాధలు వర్ణణాతీతం. రెండేళ్ల పాలనలో నయాపైసా అయినా ఈ మున్సిపాలిటీకి ఇచ్చారా? ఇయ్యలే. రెండేళ్లలో పైసా ఇయ్యనోడు... ఇగ మూడేళ్లలో ఏం చేస్తాడు? బీఆర్ఎస్ పాపాలు అన్నీ ఇన్నీ కావు. రాజన్నను మోసం చేశారు. కాళేశ్వరం కూలింది. మల్లన్న సాగర్ దెబ్బతిన్నది. ఆ పాపాలన్నీ పెరిగినయ్ కాబట్టే బీఆర్ఎస్ ప్రభుత్వం కూలింది. 10 ఏళ్లు రాజ్యమేలిన బీఆర్ఎస్ ప్రజల రక్తం పీల్చుకుంది. సాక్షాత్తు ఎములాడ రాజన్నకే కేసీఆర్ శఠగోపం పెట్టిండు. గుడిని అభివ్రుద్ధి చేస్తానని మోసం చేసిండు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను రాచిరంపాన పెట్టారు. అవినీతిని ఏరులై పారించారు. కేంద్రం నిధులిస్తే... కమీషన్లు దండుకుని నిధులను డైవర్ట్ చేసింది. మరి బీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలి? మళ్లీ ఆ పార్టీకి ఎందుకు ఓటేయాలి? కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి. 6 గ్యారంటీలను అమలు చేశారా? మహిళలకు రూ.2500 ఇచ్చారా? తులం బంగారం, స్కూటీ ఇచ్చారా? అవ్వాతాతలకు రూ.4 వేల పెన్షన్ ఇచ్చారా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలిచ్చారా? విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇచ్చారా?... వాళ్లు ఏం చేశారని కాంగ్రెస్ కు ఓటేయాలి? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పైసలే లేవు. నన్ను కోసినా నయాపైసా రాదని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డే మాట్లాడుతున్నడు. తెలంగాణకు తండ్రిలాంటి ముఖ్యమంత్రే చేతులెత్తేస్తే... ఇగ కాంగ్రెస్ కు ఓట్లు వేసి ఏం లాభం? అందుకే ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను గల్లాపట్టి నిలదీయండి. మీకెందుకు ఓటేయాలి? ఎట్లా అభివ్రుద్ధి చేస్తారు? గతంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని నిలదీయండి. మోదీ పేద కుటుంబం వచ్చారు కాబట్టే కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులిస్తున్నారు. ఎములాడకు 14, 15 ఆర్ధిక సంఘం పేరుతో 16 కోట్ల రూపాయలు ఇచ్చినం. 4 కోట్లకుపైగా ఎంపీ లాడ్స్ నిధులిచ్చిన. 13 కోట్ల రూపాయలకుపైగా అమ్రుత్ పథకం కింద నిధులిచ్చిన. స్వనిధి కింద 4 వేల మందికిపైగా చిరు వ్యాపారులకు స్వనిధి కింద రూ.6 కోట్లకుపైగా నిధులిచ్చినం. పేద విద్యార్థులందరికీ 20 వేల సైకిళ్లు ఇచ్చిన. టెన్త్ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించిన. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2 కోట్ల విలువైన అత్యాధునిక మెడికల్ ఎక్విప్ మెంట్స్ ఇచ్చిన. ఎములాడకు ప్రధానిని తీసుకొచ్చిన. మున్సిపాలిటీని అప్పగిస్తే ఎములాడకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తానని మోదీ నాకు చెప్పారు. ఆయన మాటకు మీకు చెబుతున్నా... నిధులు ఇచ్చేది మోదీ... తెచ్చేది నేను. వడ్డించోడు మనోడైతే ఆఖరి బంతిలో అన్ని వడ్డీస్తారు. కాబట్టి నిధులిచ్చే, తెచ్చే బీజేపీకి ఓటేసి వేములవాడ మున్సిపాలిటీని మోదీకి అప్పగించాలని కోరుతున్నా. కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసపూరిత మాటలు నమ్మి మోసం పోవద్దు. ఈనెల 11న జరిగే పోలింగ్ లో పువ్వు గుర్తుకు ఓటేసి మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠాన్ని బీజేపీకి గెలిపించండి. మళ్లీ చెబుతున్నా... మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే.. కేంద్రం నుండి వరదలా నిధులు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా
Admin
DNB News