DNB News - తెలంగాణ / : మునగాల మండల ఆకుపాముల గ్రామ నివాసి అయిన శ్రీ లిక్కి కృష్ణంరాజు (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మల్కాజ్గిరి కమిషనరేట్), వారి కుమారుడు లిక్కి వర్షిత్ (8వ తరగతి విద్యార్థి) , రాజుల శ్రీనివాస్ గారు (కృష్ణంరాజు బావగారు) మరియు కొమురబండ, ఆకుపాముల గ్రామ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయులు శ్రీ మల్లెబోయిన సత్యనారాయణ గారు నలుగురు కలిసి 2026 మార్చి 28వ తేదీ నుండి 14 రోజులపాటు నేపాల్ దేశంలోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (5434 మీటర్ల ఎత్తు) ను ట్రెక్కింగ్ ద్వారా విజయవంతంగా చేరుకొని, ఈరోజు స్వదేశానికి తిరిగి వచ్చి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. వారి ఈ సాహస యాత్ర పట్ల మునగాల మండల ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండలంలోని యువత మరియు ప్రజలు వీరి యాత్రను ఆదర్శంగా తీసుకుని, ఇలాంటి సాహస యాత్రల్లో పాల్గొనాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. వారి యాత్ర వివరాలు వారి మాటల్లోనే ఇలా ఉన్నాయి: హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుండి ఎయిర్ ఇండియా విమానంలో కాఠ్మాండు (త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం) కు చేరుకుని, అక్కడి నుండి వాహనం ద్వారా రామేఛాప్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుండి చిన్న విమానం ద్వారా లుక్లా విమానాశ్రయానికి చేరుకొని,(ప్రపంచంలో అతి చిన్న రన్వే కలిగిన విమానాశ్రయం) అక్కడి నుండి ట్రెక్కింగ్ ప్రారంభించి 7 రోజుల్లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో 3 రోజుల్లో లుక్లాకు చేరుకుని, అక్కడి నుండి తిరిగి కాఠ్మాండు ద్వారా భారతదేశానికి వచ్చారు. ఈ యాత్రలో 5434 మీటర్ల ఎత్తుకు చేరడం, మైనస్ 10 నుండి 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం, అక్కడి ఆహారం మరియు జీవన విధానాన్ని అనుభవించడం వంటి అనేక కొత్త అనుభూతులను పొందినట్లు వారు తెలిపారు. జీవితం అనేది ఒక ప్రయాణమని, ఇలాంటి యాత్రలు మనిషికి అమూల్యమైన అనుభవాలను, జ్ఞానాన్ని అందిస్తాయని వారు పేర్కొన్నారు. చివరిగా, “జీవితం అంటేనే ఒక ప్రయాణం” అని మనందరం గుర్తుంచుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.
Admin
DNB News