DNB News - తెలంగాణ / : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అనుమానంతో కలకలం రేగింది. హాస్టల్లో భోజనం చేసిన అనంతరం సుమారు 34 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆదివారం కావడంతో హాస్టల్లో విద్యార్థులకు మటన్తో ప్రత్యేక భోజనం వడ్డించారు. అయితే భోజనం చేసిన కొద్దిసేపటికే కొందరు విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది అస్వస్థతకు గురైన విద్యార్థులను చికిత్స కోసం తరలించారు. వీరిలో నలుగురు విద్యార్థులను మణుగూరులోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మిగతా విద్యార్థులను కూడా వైద్యులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మటన్ భోజనం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నప్పటికీ దీనిపై ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ వెలువడలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హాస్టల్లో అందించే ఆహార నాణ్యతపై సమగ్రంగా దర్యాప్తు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Admin
DNB News