DNB News - తెలంగాణ / : బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లి, ఆయన చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని, ఆ మహనీయుని స్ఫూర్తితోనే మన ప్రభుత్వం ప్రజా రంజక పాలన అందిస్తోందని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం భారత మాజీ ఉప ప్రధాని, బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఖమ్మం నగరంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ, జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. దేశ ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంలో బాబు జగ్జీవన్ రామ్ పాత్ర చిరస్మరణీయమని అన్నారు. కేంద్ర మంత్రిగా ఆయన తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు ఈనాటికీ పాలకులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. రక్షణ శాఖ మంత్రిగా గాని, ఇతర ఏ శాఖ బాధ్యతలు చేపట్టినా, ఆ శాఖకు సరికొత్త ఔన్నత్యాన్ని తీసుకువచ్చిన గొప్ప పరిపాలనాదక్షుడు ఆయనని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. సామాజిక మార్పు కోసం అవిరళ కృషి, దేశంలో సామాజిక సమానత్వం, మార్పు కోసం జగ్జీవన్ రామ్ అనేక పోరాటాలు చేశారని, దేశ భవిష్యత్తుకు ఆయనో దిక్సూచిలా నిలిచారని డిప్యూటీ సీఎం తెలిపారు. అత్యంత పేదరికం, వెనుకబాటుతనం నుంచి వచ్చినప్పటికీ, తన కృషితో దేశంలోనే అత్యున్నత స్థానాలకు ఎదిగారని, అధికారాన్ని అనుభవించడానికి కాకుండా, దేశ ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని ధారపోశారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.రాజకీయాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరికీ బాబు జగ్జీవన్ రామ్ జీవితం ఒక పాఠమని, ఆయనది నిరంతరం ప్రగతిశీలమైన పంథా అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రాం జీవితం ద్వారా చెప్పడం కంటే, చేతల ద్వారానే సందేశం ఇచ్చారని అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేశారన్నారు. పార్లమెంటేరియన్ గా, కేంద్ర మంత్రిగా, ఉప రాష్ట్రపతి గా విశిష్ట సేవలు అందించారన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి విద్యతోనే సాధ్యమవుతుందని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఇచ్చిన స్పూర్తితో ముందుకు వెళ్లాలని, ఆయన ఆశయ సాధనకు అందరం కలిసికట్టుగా పని చేయాలని, ప్రభుత్వ ఫలాలు అర్హులకు అందేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని కలెక్టర్ అన్నారు. అనంతరం అంబెడ్కర్ భవన్ లో జరిగిన డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ పాల్గొని, డా. బాబు జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు. వారు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషిని, తెచ్చిన సంస్కరణలను గుర్తు చేశారు. వారు చూపిన మార్గంలో నడిచి, వారి ఆశయ సాధన కు కృషిచేయడమే, వారికిచ్చే నివాళి అని అదనపు కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే రాందాసు నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఎస్సి సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి. జ్యోతి, ఎస్సి కార్పొరేషన్ ఇడి నవీన్ బాబు, జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్లు కామా ప్రభాకర్, మారేపల్లి వెంకట నారాయణ, అధ్యక్షులు పేర్ల మధు, సంతేటి వీరభద్రం, గౌరవ అధ్యక్షులు జమ్మి వీరబాయి, పడిశాల వెంకన్న, లింగాల రవికుమార్, బచ్చలికూర వెంకటేశ్వర్లు, దాస్ మహరాజ్, తూరుగంటి రాజయ్య, గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి, టీఎన్జీవో ఖమ్మం జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి కొణిదెన శ్రీనివాస్, టీ మేసా ఉపాధ్యక్షులు అబ్దుల్ సత్తార్, ఉపాధ్యాయ సంఘ నాయకులు కట్టా శేఖర్, షేక్ రంజాన్, వెంకటరమణ, వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News