DNB News - తెలంగాణ / : హైదరాబాద్: హోలీ పండుగను నగర ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని V.C. Sajjanar, ఐపీఎస్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పౌరులకు సూచించారు. ఇతరులకు అసౌకర్యం కలిగించే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సోమవారం బంజారాహిల్స్లోని TGICCCలో పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. హోలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా “విజిబుల్ పోలీసింగ్”కు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నగరమంతా బ్లూ కోల్ట్స్, పట్రోలింగ్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇష్టంలేని వ్యక్తులపై బలవంతంగా రంగులు చల్లడం సహించబోమని కమిషనర్ హెచ్చరించారు. రహదారులపై నడిచే ప్రజలపై, వాహనాలపై రంగులు వేయడం, ప్రజా ప్రదేశాల్లో అల్లరి చేయడం నేరమని తెలిపారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు షీ టీమ్స్ పని చేస్తాయని చెప్పారు. రసాయనిక రంగుల స్థానంలో సహజ రంగులు ఉపయోగించాలని ప్రజలకు సూచించారు. హోలీ వేడుకల సందర్భంగా డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గుంపులుగా రోడ్లపై తిరిగి అల్లరి సృష్టించే యువకుల వాహనాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం రంజాన్ నెల కొనసాగుతున్న నేపథ్యంలో ముస్లిం ప్రార్థనలకు ఎటువంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు భద్రత ఏర్పాటు చేసి, శాంతి కమిటీలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. హోలీ సందర్భంగా మార్చి 3 (మంగళవారం) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలు, తాటి కల్లు దుకాణాలు, బార్లు & రెస్టారెంట్లపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. నియమాలను ఉల్లంఘించే వారిపై సిటీ పోలీస్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని కమిషనర్ తెలిపారు. నగరంలో ఎక్కడైనా శాంతి భద్రతల సమస్యలు తలెత్తితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరించి హోలీ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీలు స్వేత, ఎస్.ఎం. విజయ్ కుమార్, డీసీపీలు ఖరే కిరణ్ ప్రభాకర్, రూపేష్, వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News