DNB News - తెలంగాణ / : సైబర్ క్రైమ్ కేసులో లంచం తీసుకుంటూ ఇద్దరు పోలీసు అధికారులు ఏసీబీకి చిక్కారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్స్ కార్యాలయానికి చెందిన ఎస్సై ప్రమోద్ గౌడ్, ఆర్ఎస్సై జతావత్ బాబు నాయక్ రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఓ సైబర్ క్రైమ్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 (పూర్వం సీఆర్పీసీ 41ఏ) ప్రకారం నోటీసులు ఇవ్వాలని నిందితుడి తరఫువారు కోరినట్లు సమాచారం. అయితే అందుకు రూ.లక్ష ఇవ్వాలని ఈ ఇద్దరు అధికారులు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. దీంతో నిందితుడి తరఫువారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు ఎల్బీ నగర్ చౌరస్తా సమీపంలో డబ్బులు ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన ఆర్ఎస్సై జతావత్ బాబు నాయక్ డబ్బులు తీసుకుంటున్న సమయంలో ముందుగానే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. అనంతరం ఎస్సై ప్రమోద్ గౌడ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు వెల్లడించారు.
Admin
DNB News