DNB News - తెలంగాణ / : ఖమ్మం రూరల్ మండలంలోని తీర్దాల సంగమేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి సందర్భంగా జాతర నిర్వహణకు విస్తృతంగా ఏర్పాటు చేయాలని, ప్రణాళిక ప్రకారం నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని తన చాంబర్ లో మంగళవారం తీర్థాల మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 18 వరకు 5 రోజుల పాటు మహా శివరాత్రి జాతర వేడుకలను అత్యంత వైభవోపేతంగా తీర్థాలలో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్ధ మయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల గ్రామంలో ఉన్న సంగమేశ్వర స్వామి దేవాలయానికి విచ్చేసి స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉందని, గతం కంటే భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరమైన మేర పారిశుధ్య కార్మికులను నియమించి ఆలయ ప్రాంగణం, జాతర పరిసరాలను నిరంతరాయంగా శుభ్రం చేస్తూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుద్ధ్య కార్మికులకు డ్రెస్ కోడ్ ఉండాలని, మండల పంచాయతీ అధికారి పారిశుధ్య కార్యక్రమాలు పర్యవేక్షించాలని కలెక్టర్ అన్నారు. తగినంత బ్లీచింగ్ అందుబాటులో ఉంచాలన్నారు. జాతర సమయంలో, జాతర తర్వాత పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అన్నారు. జాతర సందర్భంగా ఉన్న 30 టాయిలెట్స్ బ్లాకులను రన్నింగ్ వాటర్ తో సహా అందుబాటులో ఉంచాలని, నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. భక్తులకు త్రాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. తీర్దాల దేవాలయం వద్ద ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కలెక్టర్ తెలిపారు. భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా అవసరమైన మేర బస్సుల సంఖ్య పెంచాలని, రద్దీగా ఉండే రూట్లలో అదనంగా బస్సులు నడపాలన్నారు. దేవస్థానం వద్ద క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, స్నాన ఘట్టాల వద్ద రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేయాలని, మిషన్ భగీరథ ద్వారా భక్తులకు త్రాగునీటి వసతి కల్పించాలని కలెక్టర్ సూచించారు. జాతర సందర్భంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 4 ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ప్రతి వైద్య శిబిరంలో వైద్యాధికారులు పారామెడికల్ సిబ్బందినీ సరిపోను ఓఆర్ఎస్, అత్యవసర మందులతో అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. రెండు 108 వాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఫైర్ ఇంజన్ కావాల్సిన పరికరాలు, సిబ్బందితో జాతరలో అందుబాటులో ఉంచాలన్నారు. పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని, క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. అన్ని శాఖల అధికారులు సిబ్బంది సహాయ సహకారంతో విధులు నిర్వహించాలని, భక్తులకు ఇబ్బందులు కలకుండా అవసరమైన మేర సైన్ బోర్డులు, ఎంట్రీ, ఎగ్జిట్ బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు. అన్ని శాఖల అధికారులతో కంట్రోల్ రూం ఏర్పాటుచేయాలని, తప్పిపోయిన, భక్తులకు సూచనలకు మంచి పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటుచేయాలని అన్నారు. మహాశివరాత్రి జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు ఆయా శాఖలకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాలని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా జాతరలో వసతుల కల్పనకు కలెక్టరేట్ నుండి 10 లక్షల రూపాయల చెక్కును ఆలయ ఏవో కు కలెక్టర్ అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. రామారావు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, మిషన్ భగీరథ ఇఇ పుష్పలత, ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రాంప్రసాద్, తీర్థాల ఆలయ ఏవో కె. వేణుగోపాల్, విద్యుత్ డి ఇ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీ చేయనైనది.
Admin
DNB News