DNB News - తెలంగాణ / : తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీ.ఎస్.ఆర్.టీ.సి) కార్మికుల సమస్యలు దీర్గకాలంగా పెండింగులో ఉన్నందున వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు, సహకారం అందించి, ఆర్టీసీ రక్షణ కోసం జనసేన పోరాడుతుందని, రేవంత్ సర్కార్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీల అమలు విషయంలో వెనకడుగు వేసి మోసగించడం వల్ల ఆర్టీసీ కార్మికుల గోస తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని జనసేన పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లతో చీకటి ఒప్పందం చేసుకొని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి శంకర్ గౌడ్ శవంతో రాజకీయం చేయడం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ కి అలవాటుగా మారిందని, గతంలో కూడా ఆర్టీసీ డ్రైవర్ బాబు శవంతో కూడా బండి సంజయ్ రాజకీయం తన రాజకీయ పబ్బం గడుపుకున్నాడని బేతి మహేందర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని, మరి ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట తప్పడం సిగ్గుచేటని, అలాగే రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో మొండి వైఖరి అవలంభించడం వల్లనే నేడు నర్సంపేటకు చెందిన శంకర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడడం, మృతి చెందడం జరిగిందని, శంకర్ గౌడ్ ది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యగా పరిగణించాలని బేతి మహేందర్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. రాష్ట్రంలో దొంగదారిలో అధికారం రావడానికి ఉచిత పథకాలు అమలు రూపంలో మహిళల ఓట్ల కోసం మహాలక్ష్మి పథకం అమలు చేస్తే ఈ పథకంలో ప్రతి నెల ఆర్టీసీకి ఇవ్వాల్సిన 400 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఆర్టీసీని తీవ్రంగా నష్టం కలిగిస్తూ, ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన 30 పర్సెంట్ వేతన సవరణ, ఫిట్మెంట్, డి.ఏ లతో పాటు రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా ఆర్టీసీ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బేతి మహేందర్ రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చే వరకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తూ కార్మికులకు అండగా నిలుస్తుందని పేర్కొంటూ శంకర్ గౌడ్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించి వారి కుటుంబానికి అండగా ఉంటామని జనసేన పార్టీ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వొడ్నాల రాజు, టీ. శ్రీధర్, ఎం. సంపత్, అంబాల సృజన్ కుమార్, ముంజ నాగరాజు, పుప్పాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News